వైట్ హౌస్‌లో రెండు గంటలపాటు భేటీ.. సంతకం చేయకుండానే బయటకొచ్చిన ట్రంప్

  • అమెరికా ప్రయోజనాలే ముఖ్యమన్న వైట్ హౌస్
  • టెహ్రాన్‌పై విధించే ఆంక్షలు, నిబంధనలపై ట్రంప్ సంతృప్తి చెందాలని వెల్లడి
  • అవసరమైతే మళ్లీ యుద్ధం ప్రారంభించే సత్తా ఉందన్న పీట్ హెగ్సెత్
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికాతో ఒప్పందం ఖరారు కాలేదని ఇరాన్ కూడా ప్రకటించింది. అయితే, ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం వైట్‌హౌస్‌లో రెండు గంటలపాటు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అయితే, ఈ భేటీలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే బయటకు వచ్చారు. ఇరాన్‌తో ఘర్షణ ముగించే ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయలేదు.

ఒప్పందం దాదాపు ఖరారైనప్పటికీ, స్తంభింపజేసిన ఇరాన్ నిధుల విడుదల వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ సమావేశం అనంతరం వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. "అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా, అధ్యక్షుడు నిర్దేశించిన షరతులకు లోబడి మాత్రమే ఒప్పందం జరుగుతుంది. ఇరాన్‌ను అణ్వాయుధం కలిగి ఉండేందుకు ఎప్పటికీ అనుమతించబోం" అని స్పష్టం చేసింది. టెహ్రాన్‌‌పై విధించే ఆంక్షలు, నిబంధనలపై ట్రంప్ సంతృప్తి చెందాలని అన్నారు. ఆ తర్వాతే ట్రంప్ డీల్‌పై సంతకం చేస్తారని చెప్పారు.

సమావేశానికి ముందు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్‌లను తొలగించాలని, అందుకు బదులుగా అమెరికా నావికాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుందని పేర్కొన్నారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను ధ్వంసం చేయాలని, తదుపరి నోటీసు వచ్చేవరకు ఎలాంటి నిధుల మార్పిడి జరగదని ఆయన తేల్చిచెప్పారు. స్తంభింపజేసిన 12 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయాలన్న ఇరాన్ డిమాండ్‌ను ఆయన పరోక్షంగా తోసిపుచ్చారు.

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఇరాన్‌తో యుద్ధం తిరిగి ప్రారంభించే సత్తా అమెరికాకు ఉందని అన్నారు. తమ వద్ద అవసరమైన ఆయుధ నిల్వలు ఉన్నాయని తెలిపారు. పశ్చిమాసియాలో తమ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

Donald Trump
Iran
US Iran relations
White House
Iran nuclear deal
US military
Middle East
Sanctions

More Telugu News